Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 16

Dasaratha receives the 'Payasa' to be given to his Queens

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః |
జానన్నపి సురావేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

తా|| అప్పుడు ( బ్రహ్మాదిదేవతలు ఇట్లు ప్రార్థింపగా) దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో ఇట్టి వచనములతో పలికెను.

బాలకాండ
పదునాఱవ సర్గము
( దశరథుని భార్యలు గర్భము దాల్చుట )

అప్పుడు ( బ్రహ్మాదిదేవతలు ఇట్లు ప్రార్థింపగా) దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో ఇట్టి వచనములతో పలికెను.

'ఓ దేవతలారా ! ఆ దురాత్ముడైన రావణుని వధించుటకు ఉపాయము తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంతకుని హతమార్చెదను'.

అవ్యయుడు అయిన శ్రీమహావిష్ణువు వచనములను విని ఆ దేవతలందరూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ' ఓ అరిందమా ! నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు చాలాకాలము తీవ్రముగా తపమొనర్చెను. సృష్ఠికర్తయు దేవతలలో అగ్రజుడు అయిన బ్రహ్మవాని తపమునకు సంతుష్టుడాయెను. సంతుష్టుడైన బ్రహ్మ ఆ రాక్షసునకు వరమిచ్చెను. మానవులు తప్ప నానావిధములైన ప్రాణులవలన అతడికి ప్రాణభయము లేకుండునట్లు వరము పొందెను. మానవులఎడ చులకనభావమే ఇందుకు కారణము'.

'ఈ విధముగా పితామహుని వరమువలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు . స్త్రీలను గూడా అవమానము చేయుచున్నాడు. కావున ఓ అరిసూదనా అతడు మానవులవలనే మరణించుట సంభవము'.

సమస్తప్రాణులకును ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు దేవతలమాటలను ఆలకించి దశరథ మహారాజు కి పుత్త్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను.
అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రుసంహారకుడైన దశరథ మహారాజు పుత్త్రులులేక మథన పడుచుండెను. పుత్త్రప్రాప్తికై అతడు పుత్త్రకామేష్టి అను యాగమును ఆచరించెను.

విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను.పిమ్మట దేవతల , మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్థానమయ్యెను.

అప్పుడు ఆ యజమాని ( దశరథుని) యొక్క యజ్ఞకుండమునుండి మహా అద్భుతమైన తేజస్సుగల మహాబల సంపన్నుడైన ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమాయెను. అతడు కృష్ణవర్ణముతో ఎఱ్ఱని వస్త్రములు ధరించి దుంధుభి వంటి కంఠస్వరము కలిగి యుండెను. అతని రోమములు మీసములు కేశములు సింహపు జూలువలె మృదువుగా ఉండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు. దివ్యాభరణములను ధరించి యున్నవాడు. కొండ శిఖరమువలె ఉన్నతమైనవాడు.మదించిన పెద్దపులివలె భయంకరుడు. సూర్యునితో సమానముగా ప్రకాశించుచు ప్రజ్వలించుచున్న అగ్ని వలే వెలుగొందుచున్నవాడు. అతడు ఒక దివ్యమైన పాయసముతో నిండి యున్న బంగారుపాత్రను స్వయముగా ప్రియపత్నివలె రెండు చేతులతో పట్టుకొని యుండెను.

ఆతడు దశరథమహారాజుని చూచుచూ ఈ వాక్యములను పలికెను. ' ఓ రాజా నన్ను ప్రజాపతి పంపగా ఇచటికి వచ్చితిని'. అప్పుడు ఆ రాజు అంజలిఘటించి ' ఓమహాత్మా స్వాగతము. నేను చేయవలసిన కర్తవ్యము చెప్పుము' అని.

పిమ్మట ప్రజాపతిచే పంపబడిన అతడు మరల పలికెను. 'ఓ రాజా ! దేవతలను అర్చయించి వారి అనుగ్రహముతో దీనిని పొందితివి. ఓ రాజా! ఈ పాయసము దేవతలచే చేయబడినది. ఇది సంతానము ప్రసాదించును. సంపత్కరము అరోగ్యము ప్రసాదించునదియునూ కూడా. దీనిని స్వీకరించుము. ఈ పాయసమును నీ అనురూపులగు భార్యలకు ఇచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని భుజించుటవలన యజ్ఞఫలముగా నీభార్యలకు సంతానము కలుగును.'

అప్పుడు రాజు "ఆటులనే" అని పలికి ప్రీతితో వినమ్రుడై హిరణ్మయి అయిన దేవతలచే ఇవ్వబడిన పాయసముతో నిండియున్నపాత్రను గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడైయున్న ఆ దివ్యపురుషునకు (దశరథ మహారాజు) పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములనొనెర్చెను. దశరథమహారాజు ఆ దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది ధనములేనివాడు ధనముపొందినట్లు మహదానంద భరితుడాయెను.

ఆ ( పాయస ప్రదాన) కార్యక్రమమును ముగించికొని అద్భుతాకారముతో దివ్యతేజస్సుతో విరజిల్లుచుండిన ఆ మహాపురుషుడు వెంటనే అంతర్థానమయ్యెను.

సంతోషకిరణములతో భాసించుచున్నఆ రాజు యొక్క సంతోషకిరణములతో ఆ అంతఃపురము లోని స్త్రీలందరూ శరత్కాలమందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాసించు ఆకాసమువలే ప్రకాసించుచుండిరి.

ఆ రాజు కౌసల్యాదేవికి ఆ పాయసములో అర్థభాగమిచ్చెను. మిగిలిన సగములో సగము భాగము సుమిత్రాదేవికిచ్చెను. మిగిలిన పావు భాగములో సగము కైకేయికి మిగిలిన పావులో సగము భాగము మరల సుమిత్రకిచ్చెను. ఈ విధముగా పుత్త్రసంతానప్రాప్తికై ఆ పాయసము ముగ్గురు రాణులకు పంచిబెట్టెను. ఆ ముగ్గురు రాణులు ఆ నరేంద్రుని నుంచి ఆ పాయసము గైకొని అది తమకు జరిగిన సమ్మానమని భావించి పొంగిపోయిరి.

అప్పుడు ఆ రాజుయొక్క పత్నులు ముగ్గురు అ పాయసమును తమతమ భాగములను భుజించి అగ్నివలే సూర్యునివలె తేజస్సుతో విరాజిల్లిరి. అచిరకాలములోనే వారు గర్భవతులైరి.

తదనంతరము (దశరథ)మహారాజు గర్భవతులైన తన భార్య్లను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువువలె సంతోషపడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షోడశస్సర్గః ||
సమాప్తం ||

తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః |
బభూవహృష్ట స్త్రిదివే యథా హరిః
సురేంద్ర సిద్దర్షి గణాభిపూజితః ||

తా|| తదనంతరము (దశరథ)మహారాజు గర్భవతులైన తన భార్య్లను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువువలె సంతోషపడెను.




|| om tat sat ||